హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే ట్రైన్లు సైతం ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్ (రైలు నం.07151) రైలు సోమవారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్య స్థానానికి చేరుకోనున్నది. యశ్వంత్పూర్ – సికింద్రాబాద్ (రైలు నం. 07152) రైలు మంగళవారం సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. రెండు రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తిరోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెహలంక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అలాగే సోమవారం పూర్ణా – తిరుపతి మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్ (నం.07633)ను నడుపనున్నట్లు చెప్పింది. రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది. అలాగే ఈ నెల 12న నర్సాపూర్ – తిరుపతి, విజయవాడ – ధర్మవరం మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్స్ను నడుపనున్నట్లు పేర్కొంది. నర్సాపూర్ – తిరుపతి (రైలు నం.07130) రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని, విజయవాడ – ధర్మవరం (రైలు నం. 07131) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ఆయా సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.