దుబాయ్: తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా.. మలి మ్యాచ్లో సత్తా చాటింది. సూపర్-12లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది. మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన పొలార్డ్ సేనకు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగినా.. తక్కినవాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో కరీబియన్ జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సఫారీ బౌలర్లలో ప్రెటోరియస్ 3, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్మ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డసెన్ (43 నాటౌట్), హెండ్రిక్స్ (39) రాణించారు. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే (1/14)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
డికాక్ మోకాలడ్డు..
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు నిరాకరించిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్.. వెస్టిండీస్తో పోరుకు దూరమయ్యాడు. ప్రపంచకప్లో ప్రతి జట్టూ ఉద్యమానికి మద్దతుగా మ్యాచ్కు ముందు మోకాళ్లపై నిల్చొని సంఘీభావం ప్రకటిస్తుండగా.. అందుకు డికాక్ నిరాకరించినట్లు సమాచారం. ఈ అంశంపై క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) స్పందిస్తూ.. ‘అది అతడి వ్యక్తిగత అభిప్రాయం. మ్యాచ్ ఆరంభానికి ముందు డికాక్ అందుబాటులో లేకుండా పోయాడు’ అని పేర్కొంది. కాగా.. తన నిర్ణయాన్ని డికాక్ సమర్ధించుకున్నాడు.