లక్నో: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసినన్ని రోజులు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపదలో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకున్నాడు. అవసరమైన వాళ్లకు తాను కేవలం ఒక్క ట్వీట్ దూరంలో మాత్రమే ఉన్నానని ఆయన చాలా సందర్భాల్లో రుజువు చేశాడు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఆపరేషన్ల కోసం రోగులను విమానంలో తరలించడం వరకు సోనూసూద్ ఎన్నో చేశాడు. దాంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యవసాయ కార్మికుడికి ట్రాక్టర్ గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా తనది ఎంత దయార్థ హృదయమో చాటిచెప్పాడు.
ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఆయన మరో మంచి పని చేశాడు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లవారి నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని ప్రజలను అభ్యర్థించాడు. ఓ తోపుడు బండిలో కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకుల దగ్గరికి వెళ్లి వారితో మాటలు కలిపాడు. వారి నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ యువకులతో సంభాషిస్తూ వీడియో కూడా తీసుకున్నాడు. తాజా కూరగాయలను ఎలా కొనాలో ఆ వీడియోలో వివరించాడు. అందరూ చిరు వ్యాపారుల నుంచి నిత్యావసరాలు కొనండి అని అభ్యర్థించాడు.
అనంతరం ఆ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశాడు. ఆర్డర్ మి ఫర్ ఎ ఫ్రీ హోమ్ డెలివరీ ఆఫ్ ఫ్రెష్ వెజిటెబుల్స్. ఈట్ హెల్తీ లైవ్ హెల్తీ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అదేవిధంగా సపోర్ట్ స్మాల్ బిజినెస్ అనే హ్యాస్టాగ్ను జతచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండీ..