న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో ప్రకంపనలు రేగాయి. రాష్ట్రపత్ని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ సహా ఎన్డీఏ ఎంపీలు పట్టుబట్టారు. అధీర్ వ్యాఖ్యలపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై తమ ఎంపీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అధినేత్రి విరుచుకుపడ్డారు. తనతో మాట్లాడవద్దని మండిపడ్డారు. మద్యాహ్నం 12 గంటలకు లోక్సభ వాయిదా పడిన సమయంలో బీజేపీ నేత రమాదేవితో సోనియా మాట్లాడుతుండగా వారి సంభాషణలో స్మృతి ఇరానీ కల్పించుకున్నారు.
ఆపై ఆగ్రహంతో ఊగిపోయిన సోనియా స్మృతి ఇరానీ వైపు తిరిగి తనతో మాట్లాడవద్దని అన్నట్టు సమాచారం. ఇక అదీర్ వ్యాఖ్యలపై అంతకుముందు స్మృతి ఇరానీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ముర్మును అవమానించారని ఆమె ఆరోపించారు. ఆదివాసి విరోధి, మహిళా విరోధి, దళిత విరోధి కాంగ్రెస్ అని స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.