న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడుత సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి రెండు విడుతలుగా నిర్వహించతలపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో మొదటి విడుత ఇప్పటికే ముగియగా రేపటి నుంచి రెండో విడుత సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ఎలా వ్యవహరించాలనే విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
అందులో భాగంగానే ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశమైంది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో సోనియాతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, ఏకే ఆంటోనీ, మల్లిఖార్జున ఖర్గే, ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎలా ఎండగట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.