చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సీట్ల పంపకంపై డీఎంకేతో చర్చలు జరిపే బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేతలైన ఊమెన్ చాందీ, రణదీప్ సుర్జేవాలాలకు అప్పగించింది. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ఇవాళ తమిళనాడుకు చేరుకోనున్నారు.
తమిళనాడుకు వెళ్లగానే రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో ఊమెన్ చాందీ, రణ్దీప్ సుర్జేవాలా సమావేశం కానున్నారు. వారితో చర్చించి రాష్ట్రంలో పార్టీ బలాబలాలు, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలు, పోటీకి సిద్ధంగా ఉన్న ఔత్సాహికులు, గెలుపు గుర్రాలు తదితర అంశాలపై ఒక అవగాహనకు రానున్నారు. అనంతరం గురువారం ఉదయం చెన్నైలో డీఎంకే నేతలతో సమావేశమై సీట్ల పంపకంపై చర్చలు జరుపనున్నారు. కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి.