‘నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే..అంటూ శ్రీవల్లిని ఆరాధిస్తూ పుష్పరాజ్ తన్మయత్వంతో పాట పాడుకుంటున్నారు. ఈ జంట మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సుకుమార్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి..మాటే మాణిక్యమాయనే’ అనే గీతాన్ని బుధవారం విడుదలచేశారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడుతూ ‘చిత్తూరు బ్యాక్డ్రాప్లో ఎర్రచందనం అక్రమరవాణా కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. అల్లు అర్జున్ పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. డీ గ్లామర్ లుక్లో రష్మిక మందన్న కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్, తొలి పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. తొలి భాగాన్ని డిసెంబర్ 17న విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.