నిజామాబాద్, జూలై 20 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి వచ్చింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషితో కొత్త అందాలను సంతరించుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ యోగా, వ్యాయామం చేసుకునే వసతులు కల్పించారు.
నడకదారులకు ట్రాక్ ఏర్పాటు చేశారు. పార్కులో సహజత్వం ఉట్టిపడేలా, కర్రలు, చెట్లను తలపించేలా కాంక్రీటుతో నిర్మించారు. గోడలపై వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులతోపాటు పెద్దలు సైతం ఈ పార్కును సందర్శిస్తుండడంతో కొత్తశోభను సంతరించుకున్నది. పచ్చదనంతో స్వాగతం చెబుతూ నగరవాసులను ఆకర్షిస్తున్నదీ పార్కు.