న్యూయార్క్ : ఆర్ధిక మందగమనంతో పలు టెక్ కంపెనీలు నియామక ప్రక్రియను నిలిపివేయడం, ఉద్యోగుల తొలగింపు వంటి వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నాయి. నెట్ఫ్లిక్స్, ట్విట్టర్, టిక్టాక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ను ప్రకటించగా తాజాగా స్నాప్ పలువురు ఉద్యోగులను సాగనంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు వెల్లడైంది. లేఆఫ్స్ దిశగా కంపెనీ మేనేజర్లు ప్రణాళికపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఇప్పటివరకూ నిర్ధష్ట వివరాలను వెల్లడించలేదు. నిరాశజనక ఆర్ధిక ఫలితాలు ప్రకటించిన అనంతరం సిబ్బందిపై వేటుకు స్నాప్ కసరత్తు సాగిస్తోందనే వార్తలు వెల్లడయ్యాయి. 6000 మంది స్నాప్ ఉద్యోగుల్లో ఎంతమందిపై వేటు వేస్తారనే వివరాలపై స్పష్టత లేదు. ఏయే ఉద్యోగులను ఏ కారణాలపై తొలగించాలనే విషయంలో మేనేజర్లు ఇంతవరకూ ఓ నిర్ణయానికి రాలేదని వార్తలు వచ్చాయి.
2018లోనూ స్నాప్ పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. హైరింగ్ ప్రక్రియను నిలిపివేసి అదనపు వ్యయాలను ఆదా చేస్తామని స్నాప్ సీఈవో ఇవాన్ స్పీగెల్ ఏడాది ఆరంభంలో పేర్కొన్నారు. గత కొన్నేండ్లుగా యాడ్స్ బిజినెస్ వృద్ధి మందగించడంతో పాటు సెల్పీ డ్రోన్ వంటి హార్డ్వేర్ ఉత్పత్తుల విక్రయంలో స్నాప్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.