స్మార్ట్ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్లాష్ అప్డేట్కు ప్రభావితమై అలాంటిదే తాను చేయాలన్న ఆలోచన అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.. ఇటు రైల్వే పోలీసులు, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చివరికి ఆ యువకుడిపై 4 ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టించింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లిలో ఉంటున్న కార్తిక్(20) ప్రైవేటు ఉద్యోగి. బుధవారం ఖాళీ సమయంలో అతడు తన స్మార్ట్ఫోన్లో యూట్యూబ్ చానెల్ను చూస్తున్నాడు. ఆ సమయంలో అతడికి బాంబుకు సంబంధించి ఓ ఫ్లాష్ అప్డేట్ వచ్చింది. తాను ఏదో ఒకటి చేసి ఫ్లాష్ న్యూస్కు కారణం కావాలనుకున్నాడు. ఆ అప్డేట్కు ప్రభావితమై వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. రైలులో బాంబు ఉన్నదని చెప్పాడు.
అప్రత్తమైన పోలీసులు వెంటనే రైల్వే అధికారులను అలర్ట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలును చర్లపల్లిలో ఆపి మూడు గంటల పాటు తనిఖీ చేశారు. ఏ ప్రమాదకర వస్తువూ లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డయల్ 100కు వచ్చిన నంబరును ఆరా తీయడంతో కార్తిక్ వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు అతడిపై ఐపీఎసీ 182 (ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం), 186 (ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం), 505 (వదంతులు సృష్టించి గందరగోళ వాతావరణం సృష్టించడం), 507 (కుట్ర పూరితంగా, వివరాలను దాచి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం) కింద కేసులు నమోదు చేశారు.
స్మార్ట్ఫోన్లో తేలుతూ వాస్తవాన్ని మరిచి చేసిన ఓ చిన్న తప్పుకు కార్తిక్ పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. ఫోన్ ఫోబియా మంచిదికాదని, ఎంత ప్రమాదమో అందరూ తెలుసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ప్రధానంగా పిల్లలు, యువత ఈ ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటున్నారు.