బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ శనివారం అర్ధరాత్రి వేళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 90 ఏళ్ల ఎస్ఎం కృష్ణ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మణిపాల్ హాస్సిటల్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా, పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్ఎం కృష్ణ, 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. 2017లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు.
మరోవైపు కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్దార్థతో ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవిక వివాహం జరిగింది. అయితే వ్యాపారంలో నష్టాల వల్ల సిద్దార్థ ఆత్మహత్యతో ఆమె కుంగిపోలేదు. మాళవిక ధైర్యంగా కాఫీ డే సంస్థను నిర్వహిస్తున్నది. ఆ కంపెనీకి ఉన్న ఏడు వేల కోట్లకుపైగా అప్పుల్లో సగం వరకు తీర్చేసింది.