కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుని వారం రోజులు దాటింది. అయితే, కాబూల్లోని తమ న్యూస్ ఛానల్ ప్రసారమవుతున్నదని, ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నదని టోలో న్యూస్ యజమాని సాద్ మొహ్సేని తెలిపారు. ఆఫ్ఘన్ మీడియాకు స్వేచ్ఛ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు చెప్పారని, అయితే దేశంలోని స్వతంత్ర వార్తా సంస్థలు ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. టోలో న్యూస్ కార్యాలయాన్ని తాలిబన్లు సందర్శించి చాలా గౌరవంగా వ్యవహరించి తమను ఆశ్చర్యపరిచారని సాద్ చెప్పారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు మహిళలు పని చేయవచ్చన్న తాలిబన్లు ఆ మాటకు కట్టుబడలేదన్నారు. టోలో న్యూస్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ షబ్నం దావ్రాన్ను కార్యాలయం వద్ద తాలిబన్లు అడ్డుకుని వెనక్కి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం టోలో న్యూస్లోని 20 శాతం మహిళా యాంకర్లు తమ ఉద్యోగాన్ని వదులుకోవడం లేదా దేశాన్ని విడిచి ఉంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు.
కాగా, గత వారం ప్రభుత్వ రేడియో టెలివిజన్ ప్రెజెంటర్ సహర్ నాసరి ఓ స్టోరీ చేయడానికి ప్రయత్నించగా తాలిబన్లు అడ్డుకుని కెమెరా లాక్కొని సహచరుడ్ని కొట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. అలాగే ఒక జర్నలిస్ట్ బంధువును తాలిబన్లు కాల్చి చంపారని, రెండో వ్యక్తి వెంటపడగా అతడు తీవ్రంగా గాయపడినట్లు జర్మనీ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మీడియాకు స్వేచ్ఛనిస్తామంటున్న తాలిబన్ల మాటను పరిగణనలోకి తీసుకోలేమని సాద్ తెలిపారు. షరియా చట్టానికి అనుగుణంగా, జాతీయ భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేయకూడని విధంగా కంటెంట్ ఉండాలని మీడియా సంస్థలను తాలిబన్ హెచ్చరించిందని, ఇవి ఆందోళనలను పెంచే షరతులని ఆయన అన్నారు.
అయితే తమ పని చేస్తూనే ఉంటామని, ఆఫ్ఘనిస్థాన్ లోపలా లేదా బయట, లేదా రెండు చోట్లా అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సాద్ చెప్పారు. తాము గత 20 ఏండ్లుగా ఆఫ్ఘన్లకు సమాచారాన్ని అందించడానికి, ప్రజలకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయడానికి పని చేశామని, దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.