లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో ఉత్తేజం నెలకొంది. ఆరుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలతో పాటు ఓ బీజేపీ ఎమ్మెల్యే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీలో శనివారం చేరారు. బీఎస్పీ వేటుకు గురైన హరిగోవింద్ భార్గవ్, ముజ్తబా సిద్ధిఖి, హకీంలాల్ బింద్, అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం చౌధురి, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రాధోఢ్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
యోగి ఆదిత్యానాధ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో విసిగిన ప్రజలు ఎస్పీ వైపు చూస్తున్నారని, పెద్దసంఖ్యలో నేతలు తమ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, ఎస్పీ ఘనవిజయం సాధిస్తుందని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.