హనుమకొండ : నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజిద్, రాగులు విజేందర్, ఎండీ మీర్జా అక్బర్, ఎండీ పాషా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుడు అన్న చంద్ పాషా, హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు తమ్ముడు షఫీ మధ్య పశువుల కొనుగోలు, ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి వేట కత్తులు, కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
పోలీసుల కథనం ప్రకారం..
చాంద్పాషా, షఫీ సోదరులు పాతికేళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నారు. రూ.కోటి లావాదేవీలకు సంబంధించి వీరిమధ్య వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో ఎండీ షఫీ, అతని అనుచరులు ఆరుగురితో కలిసి బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆటోలో ఎల్బీనగర్లోని చాంద్పాషా ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న ఇనుప రంపంతో తలుపులను కోశారు. చాంద్పాషా, అతని భార్య సాబీరా, బావమరిది ఖలీల్పై కారంపొడి చల్లి కత్తులు, ఇనుప రంపం తో దాడిచేశారు. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న చాంద్పాషా కూతురు రూబీనా (హీనా) చంపొద్దని బాబాయి షఫీని ప్రాధేయపడింది. హీనాను వదిలేసిన షఫీ మరో గదిలో పడుకున్న చాంద్పాషా కొడుకులు ఫహద్, సమద్పై కూడా దాడికి దిగారు. ఇద్ద రూ తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి బాధితులను దవాఖానకు తరలించారు.
మృతుల్లో ఒకరైన ఖలీల్ది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం. మంగళవారం వరంగల్ వచ్చి ఇంటికి వెళ్తుండగా రైలు మిస్సయ్యింది. దీంతో సోదరి సాబీరా ఇంట్లో ఉన్నా డు. ఈ క్రమంలో షఫీ చేతుల్లో హత్యకు గురయ్యాడు.