‘గెలుపు, ఓటమి అనే పదాలకు నిర్వచనం లేదు. గెలవడం అంటే యుద్దానికి సిద్ధమవ్వడం. నా దృష్టిలో యుద్దానికి సిద్ధమైనవాడు గెలిచినట్లే లెక్క. తన ఇష్టాన్ని అనుసరిస్తూ సినిమాలు చేసిన ఉదయ్ ఎప్పుడో విజయం సాధించాడు’ అని అన్నారు ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఉదయ్శంకర్, జియాశర్మ జంటగా నటించిన చిత్రం ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకుడు. మన మూవీస్ పతాకంపై డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్, గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఉదయ్శంకర్ తండ్రి శ్రీరామ్గారు నాకు గురు సమానులు. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా.
ఈ సినిమాలో ఉదయ్ చక్కటి నటనను కనబరిచాడు పెద్ద విజయాన్ని సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘ఉదయ్శంకర్లో పట్టుదల, శ్రమించే తత్వం చాలా ఉన్నాయి. భవిష్యత్తులో హీరోగా అతడు గొప్ప పేరును తెచ్చుకోవాలి. కోటి తనయుడు రోషన్ మంచి సంగీతాన్ని అందించారు. ఫీల్గుడ్ సినిమాగా ‘క్షణక్షణం’ అందరిని అలరిస్తుందనే నమ్మకముంది’ అని పేర్కొన్నారు. ఉదయ్శంకర్ మాట్లాడుతూ ‘నేను హీరోగా నటించిన మూడో చిత్రమిది. నటనకు ప్రాముఖ్యమున్న పాత్ర పోషించా. కేవలం ఇరవై ఆరు రోజుల్లోనే పూర్తిచేశాం. గీతా ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుండటం ఆనందంగా ఉంది. అల్లు అరవింద్, బన్నీవాస్ ప్రోత్సాహం వల్లే ప్రేక్షకుల ముందుకొస్తుంది’ అని తెలిపారు. కొత్త కాన్సెప్ట్తో రూపొందించిన చిత్రమిదని, ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచదని దర్శకుడు కార్తిక్ మేడికొండ చెప్పారు. ‘సినిమాలపై ఉదయ్కి ఉన్న ఆసక్తిని గమనించి శ్రీరామ్గారి పట్ల ఉన్న గౌరవంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉత్కంఠను పంచుతుంది’ అని నిర్మాత వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటి, రోషన్, జియాశర్మ, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.