అమరావతి : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మార్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లి గూడెంలోని క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టూరిజం ప్రాజెక్టులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని, సంబంధిత ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధునిక సౌకర్యాలతో పర్యాటకం మెరుగుపడుతుందని, ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. తద్వారా ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ ప్రజలకు మెరుగైన అవకాశాలుంటాయన్నారు. విశాఖపట్నంలో లండన్-1 తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు.
వివిధ పర్యాటక ప్రాజెక్టులపై రూ.2868.6కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పలు కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్పై కనీసం రూ. 250 కోట్ల పెట్టుబడులు, ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయా కంపెనీలు ప్రకటించాయి. ఒబెరాయ్ కంపెనీ విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ఒబెరాయ్ విలాస్ పేరుతో రిసార్ట్లను ఏర్పాటు చేయనుంది. హయత్ గ్రూప్ విశాఖపట్నంలోని శిల్పారామంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనుంది. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖపట్నంలో మరో హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం, స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్.. జ్ఞానగిరిలో ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనుండగా.. ఆ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.