మాస్కో : కొవిడ్-19 సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ త్వరలో భారత్లో విడుదల కానుందని రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ బుధవారం తెలిపారు. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారతీయ వ్యాక్సినేషన్లో భాగం కావడం క్రమంగా పెరుగుతుందని, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను సైతం త్వరలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్కోలో రష్యన్-భారత విదేశాంగ మంత్రుల చర్చల ఫలితాలపై మాట్లాడారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరంగా గుర్తించడానికి చర్చలు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఆగస్ట్లో భారత్ అధ్యక్షత వహించనున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో మరింత సమన్వయాన్ని పెంపొందించేందుకు దృష్టి పెట్టామన్నారు. ఇదిలా ఉండగా.. రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) జూలై చివరి నాటికి స్పుత్నిక్ వీ, ఆస్ట్రాజెనెకా ‘మిక్స్ అండ్ మ్యాచ్’ టీకా ఫలితాలను విడుదల చేయాలని భావిస్తోంది. ఆర్డీఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్స్ ఇటీవల మాట్లాడుతూ ట్రయల్స్లో అధిక సామర్థ్యం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై చివరి నాటికి టీకాల మిక్స్ అండ్ మ్యాచ్ ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని స్పుత్నిక్ వీ ప్రారంభించింది.
భారత్లో కొవిషీల్డ్తో సరిపోలుస్తున్నామని, ఫలితం గొప్పగా ఉంటుదని, కోవిషీల్డ్ ఆస్ట్రాజెనెకా మాదిరి వ్యాక్సిన్ కాబట్టి ట్రయల్స్ సామర్థ్యాన్ని చూపుతున్నాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తుండగా.. సెప్టెంబర్లో మొదటి బ్యాచ్ విడుదల కానుంది. రెండు కంపెనీలు కలిసి సంవత్సరానికి 300 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ను భారత్లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ కేంద్రంగా నిలుస్తోంది. రష్యన్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆర్డీఐఎఫ్ భారత్లో పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.