బీజేపీ పాలిత, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో మీటర్ల ఏర్పాటుపై రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఇదేనా మీ పాలన? ఓ వైపు దేశంలో ఆకలి కేకలు పెరుగుతుంటే, మరోవైపు కేంద్రానికి ధాన్యం కొనుగోలు చేతకావడం లేదు. దేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపు జాతీయ సగటు 6-6.5 శాతమే. తెలంగాణలో 11.5-12 శాతం వరకు ఉన్నది. దీన్ని బట్టి ఎవరు రైతుల పక్షం? ఎవరు కార్పొరేట్ల పక్షమనేది స్పష్టమవుతున్నది.
-మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారని మండిపడ్డారు. మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకొస్తామని ఇచ్చిన మాట తప్పిన మోదీ.. రైతులను మోసం చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ రైతాంగానికి చేసిందేమీ లేదని, రైతులను ముంచేందుకే అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మంత్రుల నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫారసులను మలుచేయకుండానే, చేస్తున్నట్టు చెప్తూ స్వామినాథన్ను, రైతులను కేంద్రం మోసం చేస్తున్నదని ఆక్షేపించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టి రైతులను కూలీలుగా మార్చేందుకు తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రైతుల పోరాటంతో ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పి తోకముడిచారని గుర్తుచేశారు.
అధికారంలోకి వస్తే 60 ఏండ్ల దాటిన రైతులకు పింఛన్ ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు దాని ఊసెత్తడం లేదని నిరంజన్రెడ్డి విమర్శించారు. ఫసల్ బీమా యోజన లోపాల పుట్టగా ఉండటంతో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఆ పథకం నుంచి బయటికొచ్చిందని గుర్తుచేశారు. రైతులను నిండా ముంచేందుకు కేంద్రం మోటర్లకు మీటర్లు బిగిస్తున్నదని ఆక్షేపించారు. బీజేపీ పాలిత, ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలో మీటర్ల ఏర్పాటుపై రైతులు ధర్నాలు చేస్తున్నారని, ఇదేనా మీ పాలన? అని నిలదీశారు. ఓవైపు దేశంలో ఆకలి కేకలు పెరుగుతుంటే, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేతకావడం లేదని విమర్శించారు. మోదీ పాలనలో ఎనిమిదేండ్లలో ముగ్గురు ఆర్బీఐ గవర్నర్లు, ఇద్దరు నీతి అయోగ్ వైస్ చైర్మన్లు, ప్రధాన ఆర్థిక సలహాదారు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు.. ఇలా ఎంతో మంది ప్రముఖుల పదవులకు రాజీనామాలు చేయడం ప్రధాని మోదీ పాలన వైఫల్యమేనని విమర్శించారు.
మంచిగా పాలిస్తున్న రాష్ర్టాల్లో బీజేపీ క్షుద్ర కేంద్ర రాజకీయాలు చేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ చెడు రాజకీయాలకు వందేండ్లు పడితే, బీజేపీకి ఏడేండ్లు పట్టిందని.. ప్రజ లు బీజేపీని ఏవగించుకొనే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
సాగుకు నిధుల కేటాయింపులో తెలంగాణే మేటి వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని నిరంజన్రెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత యూపీలో ఆరు కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే, బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపు 4- 4.5 శాతమేనని తెలిపారు. గుజరాత్లో 2.5 కోట్ల ఎకరాల సాగు భూమికి 1.7- 2.8 శాతమే నిధులు కేటాయించారని చెప్పారు. సాగుకు బడ్జెట్ జాతీయసగటు 6-6.5 శాతమేనని, తెలంగాణ 11.5-12 శాతం వరకు ఉన్నదని వివరించారు. దీన్ని బట్టి ఎవరు రైతుల పక్షం? ఎవరు కార్పొరేట్ల పక్షమనేది అర్థమవుతున్నదని చెప్పారు. చేతనైతే, చావ ఉంటే తాము చేసే డిమాండ్లను నెరవేర్చాలని బీజేపీకి సవాల్ విసిరారు.
వ్యవసాయానికి, రైతుకు ఊతమిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుబంధు పంపిణీలో భాగంగా రెండురోజుల్లో 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు రూ.1820.75 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రైతుబంధుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పెద్ద రైతులకు రైతుబంధు నిధులు అందేది తక్కువేనని, 92.5 శాతం సన్న, చిన్నకారు రైతులకే సాయం అందుతున్నదని తెలిపారు. గురువారం మూడెకరాల భూమి ఉన్న 10.79 లక్షల మంది రైతులకు రూ. 1312.46 కోట్లు జమ చేయనున్నట్టు తెలిపారు. రైతులను ఉద్యాన పంటలవైపు మళ్లించాలని, ఇందుకోసం ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకొని ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. బుధవారం డీఏవోలు, ఏడీఏలు, డీహెచ్వోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. . డీఏవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగును పరిశీలించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, అదనపు సంచాలకుడు విజయ్కుమార్ పాల్గొన్నారు.
13వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు రూ.1,129.93 కోట్లు
14వ పైనాన్స్ కమిషన్ బకాయిలురూ.817.61 కోట్లు
15వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు రూ.1,103.70 కోట్లు
ఏపీ పునర్విభజన చట్టం ద్వారా.. రూ. 1,350 కోట్లు
2020-21 జీఎస్టీ బకాయిలు రూ.1,074 కోట్లు
2021-22 జీఎస్టీ బకాయిలు రూ.1,174 కోట్లు
సీఎస్ఎస్ బకాయిలు రూ.454 కోట్లు
మొత్తం బకాయిలు రూ. 7,183.71 కోట్లు.
ఏడేండ్లలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.3,65,797 కోట్లు
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు రూ.1,68,647 కోట్లు