హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 87.18 శాతం పీఎల్ఎఫ్తో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలన్నింటిలో నంబర్ వన్గా నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ర్యాంకులు ప్రకటించింది. 2021 ఏప్రిల్- డిసెంబర్ మధ్యకాలానికి ప్రకటించిన ఈ ర్యాంకుల్లో తెలంగాణ జెన్కో 73.98 పీఎల్ఎఫ్తో రెండో స్థానంలో నిలిచింది. 2020 ఏప్రిల్- డిసెంబర్ మధ్య 5,335 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసిన ఎస్టీపీపీ, 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 29 శాతం వృద్ధితో 6,904 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. ఆదాయంలోనూ 20 శాతం వృద్ధితో రూ. 2,879 కోట్ల అమ్మకాలు నమోదుచేసింది. సంస్థకు మొదటిర్యాంకు రావటంపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఎస్టీపీపీ అధికారులు, ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ ప్లాంట్కు శ్రీరాంపూర్ ఏరియా నుంచి బొగ్గు సరఫరా కోసం నిర్మించిన రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. లోయర్ మానేరు డ్యాంపై నిర్మించతలపెట్టిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్పై సీఎండీ సమీక్షించారు. దీనికి సంబంధించిన సర్వే పనులు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని, ఫిబ్రవరి నాటికి డీపీఆర్ సిద్ధంచేసి ప్రభుత్వ అనుమతి పొందిన వెంటనే మార్చిలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు, ఎస్టీపీపీ చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్కుమార్ సుర్, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జేఎన్ సింగ్, జీఎంలు రమేశ్బాబు, డీవీ సూర్యనారాయణరాజు, ఏజీఎం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.