కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 15: దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్లో డైరెక్టర్ సత్యనారాయణరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలకు తగిన విధంగా బొగ్గును అందించాలని భావించి సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, సహకారంతో సంస్థను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నామని, 2014లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నులు ఉంటే అది గత 8 ఏళ్లలో 30 శాతం వృద్ధిని సాధించి ఇప్పుడు 65 మిలియన్ టన్నులకు చేరిందని అన్నారు. నాడు బొగ్గు రవాణా 48 మిలియన్ టన్నులు ఉంటే అది గత ఎనిమిదేళ్లలో 41శాతం వృద్ధిని సాధించి 67.7 మిలియన్ టన్నులకు ఎదిగిందని, 2014లో 11,928 కోట్లు ఉన్న టర్నోవర్ ఎనిమిదేళ్లలో 123 శాతం వృద్ధితో 26,500 కోట్లు చేరుకుందని, ఇంతటి అభివృద్ధిని దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించలేదని పేర్కొన్నారు.