బర్మింగ్హామ్: పీవీ సింధు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్లో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ ప్లేయర్ యమగుచితో జరిగిన మ్యాచ్లో.. అద్భుత రీతిలో పీవీ సింధు తన ఆటను ప్రదర్శించింది. తొలి గేమ్ను కోల్పోయిన హైదరాబాదీ.. ఆ తర్వాత రెండు వరుస గేమ్లను తన ఖాతాలో వేసుకుని అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్నది. రసవత్తరంగా సాగిన క్వార్టర్స్లో 16-21, 21-16, 21-19 స్కోర్తో పీవీ సింధు మ్యాచ్ను కైవసం చేసుకున్నది. అయిదోవ ర్యాంక్లో ఉన్న యమగుచి తొలి గేమ్ను ఈజీగానే గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత కోలుకున్న ఏడో ర్యాంక్ ప్లేయర్ సింధు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. తొలి గేమ్లో తప్పులు చేసినా.. అనూహ్య రీతిలో సింధు కోలుకున్నది.
యమగుచితో ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లో సింధు ఓటమిపాలైంది. ఈ సారి సింధుపై యమగుచి నాలుగో విజయం సాధించడం ఖాయమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తొలి గేమ్ను యమగుచి గెలవడంతో ఆ డౌట్స్ మరింత బలపడ్డాయి. కానీ హైదరాబాదీ సింధు మాత్రం తన పూర్తి సత్తాను ప్రదర్శించింది. మూడవ నిర్ణయాత్మక గేమ్లో.. ఇద్దరూ భారీ ర్యాలీలతో హోరెత్తించారు. డిసైడర్ గేమ్లో సింధు కీలక దశలో అసామాన్య ఆటను కనబరిచింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఆ గేమ్ను 21-19తో గెలుచుకున్నది. మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నది.