సిద్దిపేట జోన్, ఏప్రిల్ 8 : ‘వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగురాలి.. అవార్డులతో పాటు ఓట్లలోనూ రికార్డులు సృష్టిద్దాం.. విపక్షాలు చేస్తున్న తప్పుడు గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టి, మనం చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి, ఓట్లు అడుగుదాం’.. అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ విద్యార్థి, యువజన కమిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవేందర్రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, విద్యార్థి యువజన విభాగం నాయకులతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ‘నా ఆలోచనంతా సిద్దిపేటను నంబర్ -1 గా నిలుపాలన్నదే. ఒక విద్యార్థి తాను చదువుతున్న తరగతిలో ఏ విధంగా నంబర్ -1 గా నిలువాలని శ్రమిస్తాడో.. సిద్దిపేట నియోజకవర్గాన్ని నంబర్ -1 గా నిలిపేందుకు అదే విధంగా శ్రమిస్తున్నాను.. రెండు మోరీలు.. రెండు రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు.. ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావడంలోనే నిజమైన అభివృద్ధి’.. అని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పచ్చని పంట పొలాలు, మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, చెరువుల్లో ఎగిరి గంతులేస్తున్న చేపపిల్లలు కనిపిస్తున్నాయన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధిని పక్క రాష్ర్టాల వారూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో ఓటు అడిగే హక్కు ఏ పార్టీకి లేదన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లేద్దామన్నారు. సిద్దిపేటకు త్వరలో రైలు వస్తుందని, దీంతో పరిశ్రమలు వస్తాయని, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ఒక ప్రయోగశాల అని, ఇక్కడ అభివృద్ధి బెంచ్మార్క్ అని చెప్పారు. విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు యువత, విద్యార్థులు వాట్సాప్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టి తిప్పికొట్టాలన్నారు. సిద్దిపేట అభివృద్ధిని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలన్నారు. సిద్దిపేటలో 26 జాతీయ అవార్డులు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధిని ముందుకు సాగిద్దామన్నారు. యువతకు మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండాస్థానం కల్పిస్తామన్నారు. యువతరం, నవతరం రాజకీయాల్లోకి రావాలన్నారు. టికెట్ రాని వారు నిరుత్సాహ పడొద్దని, వారికి మరొక విధంగా కాపాడుకుంటామన్నారు. 15 రోజులు కష్టపడి పనిచేద్దామన్నారు. ఆ తర్వాత వచ్చే ఐదేండ్లు మీ కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్, నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, పూజల వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.