చేర్యాల, అక్టోబర్ 23: 70 ఏండ్ల పాటు అధికారంలో ఉండి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టని ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య, విష ప్రచారాలను పార్టీ శ్రేణులు ఎక్కడిక్కకడ తిప్పికొట్టాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని వాసవీ గార్డెన్స్లో శనివారం చేర్యాల టౌన్, చేర్యాల రూరల్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం టౌన్, మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ 70 ఏండ్ల పాలనలో వారు చేసిన పనులు, 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బజాప్తా గ్రామాల్లో, పట్టణాల్లో టీఆర్ఎస్ నాయకులు చర్చ పెట్టాలని, ప్రతిపక్ష పార్టీ నాయకులను దీటుగా ఎదుర్కోవాలన్నారు. దేశం చూపే తెలంగాణ వైపు ఉంటే కాంగ్రెస్, బీజేపీల నాయకుల వారి రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
‘విజయగర్జన’ను విజయవంతం చేయాలి..
నవంబర్ 15వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. మండల, పట్టణ సమావేశాలు ముగించుకున్న వెంటనే గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఇంటిపై గులాబీ జెండాను ఏర్పాటు చేయాలని, పట్టణం, వార్డు, గల్లీలు అనే తేడా లేకుండా నియోజకవర్గాన్ని గులాబీమయం చేసేందుకు కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
కొనుగోళ్లలో అవకతవకలపై ప్రభుత్వ దృష్టికి..
ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల విషయాలను రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి స్వయంగా తీసుకువెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమావేశంలో వెల్లడించారు. దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి, కమిషనర్, చైర్మన్, జిల్లా కలెక్టర్, సీపీల దృష్టికి తీసుకువెళ్లడంతో విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో కాల్వ నిర్మాణం చేయడంతో పట్టణానికి శాశ్వతంగా ముంపు సమస్య తప్పిందన్నారు. సమావేశంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షురాలు తాడెం రంజితాకృష్ణమూర్తి, జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, మండల, టౌన్ మహిళా అధ్యక్షురాలు మీస పార్వతి, పచ్చిమడ్ల మానస తదితరులు పాల్గొన్నారు.