పేదలకు సకల సౌకర్యాలతో డబుల్ ఇండ్లు అభినందనీయం
ఏపీలో ఇలాంటి ఇండ్లు నిర్మిస్తాం..
ఏపీ గ్రామ, వార్డు సచివాలయం స్పెషల్ సెక్రటరీ అజయ్జైన్ .. సిద్దిపేట, గజ్వేల్లో పర్యటన
సిద్దిపేట అర్బన్/గజ్వేల్ అర్బన్/రూరల్, మార్చి 22 : కేసీఆర్నగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్లను చూస్తుంటే భారతదేశంలోనే ఉన్నామా.. అన్నంత అనుభూతి కలుగుతున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయం స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ అన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లతో పాటు గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, పట్టణ ప్రజల కోసం సంగాపూర్లో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం మూట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఇండ్లను సందర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫంక్షన్హాల్ను పరిశీలించారు. పేదలకు సకల సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సిద్దిపేట పట్టణం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని కొనియాడారు. పెద్ద నగరాల్లో నిర్మించే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి పేద ప్రజలకు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇల్లు ఇవ్వడంతో పాటు ఇంటి పట్టా సర్టిఫికెట్, కరెంట్ అనుమతి పత్రం, నీటి కుళాయి పత్రం, అసెస్మెంట్ సర్టిఫికెట్, గ్యాస్ కనెక్షన్ పత్రం ఇలా అన్ని రకాల పత్రాలు లబ్ధిదారుని పేరు మీద అందించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి నేడు పరిశీలించేందుకు వచ్చామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఆయనను సన్మానించారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా, దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా బాగా అభివృద్ధి చేశారన్నారు. అన్ని రకాల వసతులతో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం నిర్మించిన మూట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ బాగుందన్నారు. ఆయన వెంట ఆర్డీవోలు అనంతరెడ్డి, విజయేందర్రెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నర్స య్య, కౌన్సిలర్ నర్సింహులు, గజ్వేల్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ సూపర్వైజర్ మహిపాల్, తహసీల్దార్ అన్వర్ ఉన్నారు.