గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో క్రాకింగ్ హిట్ అందుకుంది శృతి. బలుపు తర్వాత రవితేజతో చేసిన రెండో సినిమా ఇది. అదే కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. మరోవైపు తాజాగా వకీల్ సాబ్ సినిమాతో మరో విజయం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. గబ్బర్ సింగ్, కాటమ రాయుడు తర్వాత పవన్ తో ఈమె నటించిన మూడో సినిమా ఇది. కాటమరాయుడు నిరాశ పరిచినా వకీల్ సాబ్ మాత్రం రచ్చ చేస్తుంది. కరోనాను కూడా పక్కనబెట్టి ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునే పనిలో బిజీ అయిపోయింది.
తాజాగా తను పని చేసిన హీరోలతో పాటు చేయబోయే హీరోల గురించి కూడా మనసులో మాట బయటపెడుతుంది. ఇప్పటికే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితోనూ నటించింది శృతి హాసన్. ప్రభాస్ ఒక్కడే బ్యాలెన్స్ ఉంటే.. ఇప్పుడు ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రశాంత్ నీల్ సినిమా సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే అభిమానులతో ముచ్చటించిన శృతి.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో మాట బయటపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు అంటే పక్కా జెంటిల్ మెన్ అంటూ సమాధానమిచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఎపిక్ (ఇతిహాసం, చరిత్ర) అంటూ సమాధానమిచ్చింది శృతి హాసన్. ఈమె ఇచ్చిన సమాధానాలతో అటు పవన్.. ఇటు మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.