యాదాద్రి, జూలై 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార ఈశాన్య మండపంలో విష్వక్సేనారాధన, స్వస్తీవాచనంతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రధానాలయంలోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించిన తర్వాత మొదటిసారిగా వస్తున్న శ్రావణమాసంలో జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు.
భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేస్తారు. మొదటి రోజు పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామని ఈవో తెలిపారు.