Srisailam | లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించామని ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార క్రతువులు జరిపించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంకాలం క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి వేద పండితులు ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన గావించి తీర్ధప్రసాదాలు అందించారు. సంధ్యా సమయంలో ప్రధానాలయంలోని నంది మండపంలో కొలువైన శనగలబసవన్నకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు.
పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాలు సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.