Shivsena Crisis |మహారాష్ట్రలోని అధికార శివసేనలో నెలకొన్న సంక్షోభం చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాష్ట్ర అసెంబ్లీలో శివసేన పక్ష నేతగా ఏక్నాథ్ షిండే కాక, ఉద్ధవ్ ఠాక్రే వర్గం నియమించిన వ్యక్తి అజయ్ చౌదరిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గుర్తించారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని ఏక్నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేవలం 15 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తి శాసనసభా పక్ష నేత కాలేరని షిండే వర్గం వాదిస్తున్నది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడాన్ని కూడా సుప్రీంకోర్టులో షిండే గ్రూప్ సవాల్ చేసింది.
ఎమ్మెల్యేల అనర్హతపై జారీ చేసిన నోటీసులకు సోమవారం (జూన్ 27) సాయంత్రంలోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఏక్నాథ్ షిండేతోపాటు 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి శనివారం సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ముందు హాజరయ్యేందుకు తమకు మరింత సమయం కావాలని, అనర్హత పిటిషన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్ను ఆదేశించాలని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తమ కుటుంబాలకు భద్రత కల్పించడానికి మహారాష్ట్ర సర్కార్కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరారు.
ఈ పిటిషన్ను జస్టిస్లు సూర్యకాంత్ జేబీ పార్దీవాలాలతో కూడిన బెంచ్ సోమవారం పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గువాహటిలో తిష్ట వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించారని సమాచారం. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ జరుగుతున్నది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. రెబెల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చిస్తున్నారు. ఉద్ధవ్ కూడా రెబెల్స్కు మెసేజ్లు పంపుతున్నట్లు తెలుస్తున్నది.