ముంబై, ఆగస్టు 1: బీజేపీ విధానాలను తరచూ తూర్పారబట్టే శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద కస్టడీలోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. అనంతరం ఈడీ రౌత్ను స్థానిక ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజుల కస్టడీకి అనుమతించింది. పత్రాచాల్ మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆదివారం ముంబైలోని రౌత్ నివాసంలో 9 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని దక్షిణ ముంబైలోని ఈడీ జోనల్ ఆఫీస్కు తరలించారు. అక్కడ దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ అర్ధరాత్రి తమ కస్టడీలోకి తీసుకున్నారు.
సంజయ్ రౌత్ నిర్భయుడు..
సంజయ్ రౌత్ అరెస్టుపై శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా.. రౌత్ లొంగలేదని, ఇందుకు తాను గర్వపడుతున్నానని సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘సంజయ్ రౌత్ పట్ల గర్వంగా ఉన్నది. అతను ఏం తప్పు చేశాడు? రౌత్ ఓ జర్నలిస్టు, ఓ శివసైనికుడు, భయం అనేది లేనివాడు. అతను ఆమోదించలేని విషయాలపై మాట్లాడుతాడు’ అని అన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఈడీ తీరును తప్పుబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతి ఎనిమిదేండ్ల ఈడీ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే.. రాజకీయ దురుద్దేశాలతో కేవలం ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్గా చేసుకొని పనిచేస్తున్నట్టు స్పష్టమౌతున్నదని విమర్శించారు. కేంద్రాన్ని వ్యతిరేకించిన వారు దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని అన్నారు.
శివసేన కార్యకర్తల నిరసనలు
రౌత్ అరెస్టు నేపథ్యంలో శివసేన నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. ఔరంగాబాద్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలో కేంద్రప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని శివసేన నేత చంద్రకాంత్ ఖైరే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బెదిరింపులకు శివసేన భయపడదని, పోరాడుతుందని పేర్కొన్నారు. నాసిక్లో నిర్వహించిన ఆందోళనలో శివసేన కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు.