Eknath Shinde Vs Udhav | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని అధికార శివసేనలో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. శివసేన అధ్యక్షుడు- మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే తదుపరి ఏ అడుగులు వేయాలన్నా పలు ఆప్షన్లు ఆయన ముందు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
బుధవారం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి గైర్హాజరైనందుకు ఏక్నాథ్ షిండేతోపాటు 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ను కోరింది. ఉద్ధవ్ సారధ్యంలోని శివసేన అభ్యర్థన మేరకు ఏక్నాథ్ షిండేపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత వేటు వేయవచ్చు. అదే జరిగితే షిండేతోపాటు 16 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాన్ని కోల్పోతారు. అప్పుడు డిప్యూటీ స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా షిండే వర్గం న్యాయ పోరాటం చేయడం ఒక్కటే మార్గం. ఎమ్మెల్యేలు లేదా ఎంపీల అనర్హత వేటుపై న్యాయ పోరాటం సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ. ఎమ్మెల్యేగా అనర్హతపై కోర్టులో ఇప్పట్లో తేలదు.
ఉద్ధవ్ ఠాక్రే సర్కార్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై సభా వేదికగా ఓటింగ్కు ఆదేశించాలని గవర్నర్కు ఏక్నాథ్ షిండే లేఖ రాయడం మరో మార్గం అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి డాక్టర్ అనంత్ కల్సే పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండే లేఖ రాసినా.. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ ఆదేశించినా అడ్డంకులు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడింట రెండొంతుల శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న ఏక్నాథ్ షిండే వర్గం ఏదైనా రాజకీయ పార్టీలో విలీనం కావాలి. ఒకవేళ బీజేపీలో విలీనమైతే.. వారు బాల్ఠాక్రేకు వారసులమని ప్రకటించుకోలేరు. అంతేకాదు వారి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది. అలా కాకుండా స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చు కుదు సారధ్యంలోని ప్రహర్ జన్శక్తి పార్టీలో విలీనం కావాల్సి ఉంటుంది. అలా కూడా కుదరని పక్షంలో ప్రస్తుతం షిండే క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలతో కూటమి కట్టాలి.
ఒకవేళ, శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే సారధ్యాన్ని సవాల్ చేయాలని షిండే గ్రూప్ భావిస్తే.. ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలా పార్టీ ఎన్నికల గుర్తును కైవశం చేసుకునే వీలుంది. కానీ, తిరుగుబాటు వర్గానికి క్షేత్రస్థాయిలో లేదని ఉద్ధవ్ ఠాక్రే టీం వాదిస్తున్నది. అసమ్మతి గ్రూప్.. పార్టీ నాయకత్వాన్ని మార్చాలన్నా శివసేన రాజ్యాంగం అనుమతించదని చెబుతున్నది. క్షేత్రస్థాయిలో తమకే మద్దతు ఉందని ఉద్ధవ్ ఠాక్రే వాదిస్తున్నారు. ఈ వివాదానికి ముగింపు చెప్పడానికి ప్రస్తుతానికి ఉద్ధవ్ ఠాక్రేతో షిండే అవగాహన కుదుర్చుకునే ఆప్షన్ కూడా ఉంది.. కానీ ఇరువైపులా మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతున్నదని, రాజీ మార్గానికి తలుపులు మూసుకు పోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.