న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలో భారత్కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటివి సమకూర్చాయి. తాజాగా ఇటలీ కూడా తన ఉదారతను చాటుకున్నది. ఆక్సిజన్ ఉత్పత్తి మొబైల్ ప్లాంట్, 20 వెంటిలేటర్లను భారత్కు సోమవారం సరఫరా చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి, పలువురు అధికారులు ఆ దేశ ప్రతినిధుల సమక్షంలో వీటిని అందుకున్నారు. ఇటలీ సహకారం ఎంతో విలువైనదని ఆయన అన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చే ప్రయత్నాల్లో ఇవి సహాయపడతాయని చెప్పారు.