మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ సమీపంలో నిర్మిస్తున్న శిల్పారామం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఆదివారం మినీ ట్యాంక్బండ్ సమీపంలో చేపడుతున్న శిల్పారామం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిల్పారామంతో పాటు ట్యాంక్బండ్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పనుల్లో నాణ్యత పాటించాలని, అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని సూచించారు. సుందర పట్టణంగా మహబూబ్నగర్ను తీర్చిదిద్దుతామని, ఇప్పటికే రోడ్ల విస్తరణ, జంక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఐటీ పార్కుతో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లిలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.