సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): షీ టీమ్స్ అధికారులు బోనమెత్తారు.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేశారు. బోనాలకు వచ్చిన మహిళా భక్తులను ఏడ్పించిన పోకిరీలను వలపన్ని పట్టుకున్నారు. మహిళలకు మేమున్నాం.. అంటూ షీ టీమ్స్ బృందాలు భరోసా ఇచ్చాయి. బోనాల పండుగ ఉత్సవాలు హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లో ఓ పెద్ద సంబురంగా జరుగుతాయి. ఈ పండుగలో ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. దీని కోసం రకరకాల బోనాలను ముస్తాబు చేసుకుని మనస్సు నిండా తమ ఇష్టదైవమైన అమ్మవారిని కొల్చుకుంటూ ఆధ్యాత్మికంగా మునిగిపోతారు.
నేపథ్యంలో వారికి పోకిరీల నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రెండు రోజుల పాటు జరిగే పండుగ వేడుకల్లో అర్ధరాత్రి వరకు షీ టీమ్స్ గస్తీని నిర్వహించారు. భారీగా రద్దీ ఉండే దేవాలయాలను గుర్తించి అక్కడ షీ టీమ్స్లోని మహిళ పోలీసు అధికారులు బోనం ఎత్తి మహిళల భక్తుల్లో కలిసిపోయారు. మరికొన్ని సందర్భాల్లో షీ టీమ్స్ మహిళా అధికారులు మహిళా భక్తులుగా మారి.. దేవాలయాల వద్ద నిఘా పెట్టారు. ఇలా చేసిన గస్తీతో షీ టీమ్స్ మొత్తం బోనాల సందర్భంగా పోకిరీ చేష్టలకు పాల్పడుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 30 మందికి కౌన్సిలింగ్తో పాటు వారిపై కేసులను షీ టీమ్స్ అధికారులు నమోదు చేశారు. మహిళల భద్రత కోసం రాజీ పడేది లేదని.. ఎవర్నీ వదిలిపెట్టమని సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్చార్జి డీసీపీ దారా కవిత తెలిపారు.