‘అంతా ఆడపెత్తనం.. ’ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పురుషులు ప్రయోగించే మాట ఇది. కానీ, పెత్తనం ఆడవారి చేతిలో ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ప్రజాప్రతినిధిగా ఆమెకు సంపూర్ణ అవకాశాలు కల్పిస్తే దేశమూ సుభిక్షంగా ఉంటుంది. మహిళా దినోత్సవం నాడు వారిని సంతోషపెట్టడానికి అంటున్న మాటలు కావు ఇవి. ఈ ఏడాది మహిళా దినోత్సవ ఇతివృత్తం ఇదే విషయాన్ని చెబుతున్నది. ‘ఉమెన్ ఇన్ లీడర్షిప్’ లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు చేసుకుంటున్నారు. స్త్రీశక్తిని గుర్తించిన వారంతా ఈ సత్యాన్ని అంగీకరించాల్సిందే!
గత ఏడాది ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా చాటి
చెప్పిన నిజం కూడా ఇదే! మహిళలు అధినేత్రులు, ప్రధానులుగా ఉన్న దేశాలు ‘కొవిడ్-19’ని నియంత్రించడంలో విజయవంతం కావడం, వైరస్ నుంచి త్వరగా కోలుకోవడం.. వారి సమర్థతను నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు. లాక్డౌన్ అమలు, అదే సమయంలో ప్రజా సంక్షేమంపై ఆమె చూపిన శ్రద్ధ, అనుసరించిన విధానాలు అందరినీ ఆలోచింపజేశాయి. కఠిన సమయంలో తమను కన్నబిడ్డల్లా చూసుకున్న ప్రధానికి న్యూజిలాండ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కరోనా కాలంలోనే జరిగిన ఎన్నికల్లో అమెకు తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టి ప్రధానిగా మరోసారి ఎన్నుకున్నారు. చైనా చెంతనే ఉన్న తైవాన్ కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఆ దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ తీసుకున్న నిర్ణయాలు ఆమెను గొప్ప లీడర్ను చేశాయి. ఇలా ఎందరో వనితలు కఠిన సమయాల్లో దృఢంగా నిలబడ్డారు. ప్రజాప్రతినిధిగా అతివను అందలం ఎక్కిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నిరూపించారు.