న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. గతంలోనే ప్రకటించిన ఈ జట్టులో శార్దూల్ స్టాండ్ బై ప్లేయర్గా ఉండగా.. బుధవారం అతడిని ప్రధాన జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను స్టాండ్ బైకి పరిమితం చేస్తూ అతడి స్థానంలో శార్దూల్కు సీనియర్ సెలెక్షన్ కమిటీ అవకాశమిచ్చినట్లు బోర్డు కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపాడు. ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పటి వరకు 18 వికెట్లు పడగొట్టాడు. అయితే లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగల సత్తా ఉండటంతోనే అతడికి జట్టులో చోటు దక్కినట్లు తెలుస్తున్నది. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్నకు ఇప్పటికే అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించగా.. ఈ నెల 15 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో బౌలింగ్కు దూరంగా ఉండటంతోనే సెలెక్టర్లు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ వైపు మొగ్గు చూపినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లు అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్, షాబాజ్ అహ్మద్తో పాటు కృష్ణప్ప గౌతమ్, లుక్మాన్ మెరివాలా, కరణ్ శర్మను అదనపు ఆటగాళ్లుగా బయోబబుల్లోనే కొనసాగించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్, హార్దిక్, జడేజా, అశ్విన్, రాహుల్ చాహర్, శార్దూల్, వరుణ్, బుమ్రా, భువనేశ్వర్, షమీ.
స్టాండ్బై: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్.