భద్రాచలం, సెప్టెంబర్ 28: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు లక్ష్మీతాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొచ్చార. సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి పూజలు నిర్వహించారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
నేడు ధనలక్ష్మి అలంకారం..
భక్తుల కోర్కెలను తీర్చడానికి లక్ష్మీదేవి గురువారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.