పరంబీర్ లేఖతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు
హోం మంత్రి పదవి నుంచి అనిల్ దేశ్ముఖ్కు ఉద్వాసన!
ఆరోపణలు తీవ్రమైనవి.. స్వతంత్ర దర్యాప్తు అవసరం: పవార్
ముంబై, మార్చి 21: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేస్తూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తున్నది. అనిల్ దేశ్ముఖ్ను పదవి నుంచి తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. అయితే దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకొంటారని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ అన్నారు. నిర్ణయం సోమవారం తెలుస్తుందన్నారు.
పరంబీర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని ఈ అంశంలో స్వతంత్ర, లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీలో పార్టీ సభ్యులతో ఆదివారం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతున్నదని, కానీ వారి కుట్రలు సఫలం కావన్నారు. లేఖ గురించి ఇప్పటికే ఉద్ధవ్తో మాట్లాడినట్టు చెప్పారు. పరంబీర్ లేఖ రాయడంపై శరద్పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ముంబై కమిషనర్ పదవి నుంచి తప్పించిన వెంటనే ఆరోపణలు చేయడం ఆలోచించాల్సిన విషయమన్నారు.
తర్వాత కొన్ని గంటలకు ఢిల్లీలోనే శరద్ పవార్తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం జయంత్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతీ నెల రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని అనిల్ దేశ్ముఖ్ పోలీసులను ఆదేశించినట్టు పరంబీర్ సింగ్ లేఖలో ఆరోపించారు.
హీరేన్ మృతి కేసులో ఇద్దరు అరెస్టు
హీరేన్ మృతి కేసులో ముంబై ఏటీఎస్ ఇద్దరిని అరెస్టు చేసింది. సచిన్ వాజేతో కలిసి గతంలో ఎన్కౌంటర్లలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్, ఓ బుకీని ఆదివారం అదుపులోకి తీసుకుంది. కేసులో వాజేనే ప్రధాన నిందితుడని, కేసు పరిష్కార మైందని డీఐజీ శివదీప్ అన్నారు.