Pawar to Shinde | శివసేన దసరా ప్రదర్శన వేదిక కోసం ముఖాముఖీ తలపడకండా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ హితవు చెప్పారు. ముంబైలోని శివాజీ పార్క్ గ్రౌండ్లో దసరా ఉత్సవాల నిర్వహణకు అనుమతించాలని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేన గ్రూప్లు పోలీసులను కోరాయి. `ఒక ముఖ్యమంత్రి ఘర్షణను నివారించాలి. ప్రతి ఒక్కరిని పరిగణనలోకి తీసుకోవాలి` అని శనివారం మీడియాతో అన్నారు.
బాల్ఠాక్రే 1966లో శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రతియేటా దసరా సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సర్కార్ పతనమైన సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండే సారధ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే అధికారం కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే గ్రూప్లు శివాజీ పార్క్లో దసరా ఉత్సవాల నిర్వహణకు పోటీ పడుతున్నాయి.
శరద్ పవార్ సలహాపై శివసేన-షిండే వర్గం అధికార ప్రతినిధి నరేశ్ మాస్కే స్పందించారు. గతంలో ఠాక్రేల హయాంలోనూ ముఖాముఖీ ఘర్షణలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె భోజనం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు ఘర్షణను నివారించాలని ఉద్ధవ్ ఠాక్రేకు పవార్ సలహా ఇచ్చారా? అని ప్రశ్నించారు. షిండేకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్న యువరాజ్ (ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి)కు అలా చేయొద్దని పవార్ కోరారా? అని నిలదీశారు.