రోజూ ఇంటికి రాగానే ‘నాన్నా’ అంటూ కాళ్లకు చుట్టుకుపోయే బిడ్డ.. కదలిక లేకుండా పడిపోయి ఉన్నాడు. అది చూసిన ఆ తండ్రి మనసు ముక్కలైపోయింది. అంతటి దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. పసివాడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ సేవ చేయడానికే ఉండాల్సిన అంబులెన్సులు అతనికి కర్కశత్వాన్నే చూపించాయి.
పసివాడిని చివరి సారిగా ఇంటికి చేర్చడానికి, దుఃఖంతో ఎర్రబడిన కళ్లతో ఉన్న ఆ తండ్రికి సాయం చేయడానికి ఒక్క వాహనం కూడా ముందుకురాలేదు. దీంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి.. ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఏడేళ్ల కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన స్థానికుల కళ్లు చెమర్చాయి. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలం దిగువపుత్తూరు గ్రామంలో జరిగింది.
ఇక్కడ నివశించే చెంచయ్య అనే వ్యక్తికి బసవయ్య (7) అనే కొడుకు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడా పిల్లాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో ఆడుకోవాలని ప్లాన్ వేశాడు బసవయ్య. ఇంటి దగ్గర్లోనే ఆడుకుంటున్న సమయంలో ఒక నాగుపాము అతన్ని కాటేసింది. దీంతో నురగలు కక్కుతూ కింద పడిపోయిన ఆ పిల్లాడు.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఇది చూసిన చుట్టుపక్కల వాళ్లు బాలుడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పిల్లాడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలిసి, మనసు ముక్కలై అక్కడకు చేరుకున్న చెంచయ్య.. తన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లబోయాడు. అయితే అతనికి ఈ పని చేయడానికి ఒక్క ప్రైవేటు వాహనం కూడా ముందుకురాలేదు.
దీంతో గుండెను బండ చేసుకొని పరిచయస్తుల దగ్గర తీసుకున్న బైక్పైనే తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రైవేటు వాహనదారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.