న్యూఢిల్లీ : నకిలీ ప్లేస్మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులను మోసం చేస్తూ భారీగా దండుకుంటున్న ముఠా గుట్టను రట్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఈ దందాను నడిపిస్తున్న ఏడుగురు మహిళలను అరెస్ట్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్లో కిలేడీల నిర్వాకం బయటపడింది. ఎయిర్పోర్టుల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరు యువతను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఎయిర్లైన్ జాబ్స్ ఇప్పించేందుకు వీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేసేవారని తెలిపారు. కిలేడీల బాగోతంపై సమాచారం అందడంతో కీర్తి నగర్ ప్రాంతంలోని వీరి కార్యాలయంపై పోలీసులు దాడులు చేపట్టారు. అరెస్ట్ చేసిన మహిళలను సుశ్మిత, ఛాయ, ఆకాంక్ష, పూజ, రోష్నీ, రేఖ, జ్యోతి గుర్తించారు.
వీరంతా 30 ఏండ్ల వయసులోపు వారేనని భావిస్తున్నారు. ఉద్యోగార్ధులు వీరు ఇచ్చిన నెంబర్లకు కాల్ చేయగానే ఎయిర్పోర్టు్ల్లో మంచి ఉద్యోగాల్లో పెట్టిస్తామని నిందితులు నమ్మబలికేవారని పోలీసులు తెలిపారు. ఇక ముందుగా రూ 2500 రిజిస్ట్రేషన్ చార్జిగా బాధితుల నుంచి వసూలు చేసేవారని ఆపై యూనిఫాం, ఇతర ఖర్చుల కింద మరికొంత మొత్తం వసూలు చేసేవారని చెప్పారు. పలు రకాల పేర్లతో బాధితుల నుంచి భారీ మొత్తాన్ని రాబట్టేవారని పశ్చిమ ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. ఎయిర్పోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ ఒక్కొక్కరి నుంచి మహిళలు రూ 32,000 వరకూ ఆన్లైన్లో వసూలు చేసేవారని తమకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు అందిందని చెప్పారు. పట్టుబడ్డ మహిళలు నేరాన్ని అంగీకరించారని, గత రెండేండ్లుగా దాదాపు 150 మందిని మోసగించినట్టు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కిలేడీలపై ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.