లోకంలో కొంతమంది భగవంతుణ్ని ఆరాధిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ఉంటూనే, సాటివారి గురించి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తారు. నిరంతరం ధ్యానంలో మునిగిపోతుంటారు. తోటివారు ఆపదలో ఉన్నా తనకు సంబంధం లేని విషయంగా భావిస్తారు. సమాజాన్ని కాదని భగవంతుడి సాయుజ్యం కోసం పరితపించడం నిజమైన భక్తుడి లక్షణం కాదు.
ఆధ్యాత్మికత మనకు ‘ఆత్మే పరమాత్మ’ అని బోధిస్తున్నది. భక్తితో కొలిచే భగవంతుడిని అంతటా చూడగలగాలి. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను దర్శించాలి. అవసరార్థులకు సేవ చేయడం మాధవ సేవ అవుతుంది. సాటివారికి సాయపడి, మానవత్వం కలవారిగా నిరూపించుకున్న వారే మహనీయులవుతారు. సమాజ శ్రేయస్సును కోరని ఆధ్యాత్మిక సాధన ఫలవంతం కాదు. భగవంతుడు అన్ని ప్రాణులకు తండ్రి లాంటివాడు. ప్రీతికరమైన సత్కర్మలను ఆచరించేవారినే ఆయన ఇష్టపడతాడు. అందుకే ‘దయగల హృదయమే భగవన్నిలయం’ అన్నారు పెద్దలు.
సేవాభావం అనేది సహజ లక్షణం కావాలి. అందరిపట్ల ఆదరణ, నిస్వార్థ ప్రేమ, తన కన్న చిన్నవారిని ప్రేమతో చూడటం, పెద్దవారి పట్ల మర్యాదగా నడుచుకోవడం మొదలైన అలవాట్లు సేవాభావానికి దారితీస్తాయి. భగవంతుడి అనుగ్రహం కోసం గుళ్లు, గోపురాలు తిరగడం మంచిదే. కానీ, ఆ ప్రయాణంలో తారసపడిన బడుగు జీవులపై కరుణ చూపకపోతే భగవంతుడు కూడా హర్షించడు. నలుగురితో కలిసి వారు చేసే మంచిపనిలో భాగస్వామి కావడం గొప్ప లక్షణం. అలాంటి పనులు సత్కర్మలుగా జీవుడి ఖాతాలో జమ చేస్తాడు భగవంతుడు. అంతేకానీ, ప్రచారాలు, ప్రశంసల కోసం చేసే పనులను పుణ్యకార్యాలు అనిపించుకోవు. ఏ చిన్న పని అయినా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం.
నిజమైన సేవ అంటే ఏమిటో స్వామి వివేకానంద ఇలా వివరించాడు. ‘నిర్మలంగా ఉంటూ, పరులకు వీలైనంత సాయం చేయాలనేదే పూజలన్నిటి సారాంశం. పేదలలోనూ, బలహీనులలోనూ, వ్యాధి పీడితులలోనూ ఈశ్వరుణ్ని చూసేవాడే నిజమైన భగవత్ ఆరాధకుడు’ అని పేర్కొన్నాడు. గుడిలో శివుణ్ని విగ్రహంగా భావించి పూజించే వాళ్ల కన్నా, గుడి బయట పేదలకు తోచినంత సాయం చేసి, చేయూతను ఇచ్చేవారే ఈశ్వరుడికి ప్రీతిపాత్రులవుతారు. తండ్రిని సేవించేవారు ముందుగా బిడ్డలను ఆదరించాలి. ఈశ్వరుడిని ఆరాధించేవారు ముందుగా ఆయన బిడ్డలైన సమస్త జీవరాశులనూ సేవించాలి. అందుకే ‘మానవ సేవగా మాధవ సేవ’ అన్నారు పెద్దలు.
– వేదార్థం మధుసూదన శర్మ, 9063887585