న్యూఢిల్లీ: మందులు, టీకాలు తయారు చేసే కంపెనీలకు ఎప్పుడూ ఒకటే భయం. ఎప్పుడైనా కాలం కలిసిరాకనో, మరే ఇతర కారణం చేతనో అవి వికటిస్తే లేక దుష్ప్రభావాలు ఏర్పడితే పరిహారం చెల్లించడం పెద్ద సమస్య. దీనినే ఇండెమ్నిటీ అంటారు. పరిహారాలు చెల్లించలేక ఒక్కోసారి కంపెనీలే మూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టీకాల పరీక్షలు పూర్తి కాకుండానే ఆదరాబాదరాగా అత్యవసర ఉపయోగానికి అనుమతిస్తున్నారు. ఇండియాకు ఇప్పుడు టీకాలు అర్జంటుగా అవసరం. విదేశీ కంపెనీలైన ఫైజర్, మోడర్నా సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఇండెమ్నిటీ నుంచి రక్షణ కల్పిస్తేనే సరఫరా చేస్తామని కచ్చితంగా తెగేసి చెప్పాయి. గత్యంతరం లేక భారత ప్రభుత్వం అంగీకార సూచనలు వెలువరించినట్టు వార్తలు వచ్చాయి. ఇదంతా గమనించిన భారతీయ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (ఎస్ఐఐ) తనకూ ఇండెమ్నిటీ నుంచి రక్షణ కావాలని అడుగుతున్నది. విదేశీయ, స్వదేశీయ కంపెనీలు అన్నిటికీ ఒకే సూత్రం వర్తించాలని వాదిస్తున్నది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనెకా టీకాను కోవిషీల్డ్ పేరుతో భారత్లో తయారుచేస్తున్నది. కోవోవ్యాక్స్, కోడాజెనిక్స్, స్పైబయోటెక్ అనే మరో మూడు టీకాలపై అధ్యయనాలు కూడా జరుపుతున్నది. విదేశీ కంపెనీలు ఇండెమ్నిటీ రక్షణ కోరడం గురించి ఆరోగ్య శాఖ వర్గాల దగ్గర మీడియా ప్రస్తావిస్తే ‘అది పెద్ద సమస్య ఏమీ కాదు’ అని సమాధానం వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. అమెరికా వంచి దేశాలు అత్యవసర పరిస్థితి దృష్య్టా టీకా కంపెనీలకు ఇండెమ్నిటీ నుంచి రక్షణ కల్పించాయి. ఇప్పుడు భారత్ ఏదో ఒకటి తేల్చుకునే సమయం వచ్చింది.