ఘట్కేసర్ రూరల్, జూన్ 23: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువతి, ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు జాతీయ రహదారిపై గుర్తు పట్టలేని విధంగా, చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవుషాపూర్లో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా దేవరొప్పుల మండలం, సింగరాజ్పల్లికి చెందిన పాలడుగు నవీన్(25) దిల్సుఖ్నగర్లో ఉంటూ ఉబెర్ రైడర్గా పనిచేస్తున్నాడు.
లింగాలఘనపురం మండలం, కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్(23) పంజాగుట్టలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిత్తాపూర్కు చెందిన ఎన్.వినిత(21) అబిడ్స్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. అయితే పాలడుగు నవీన్, దాసరి నవీన్ చిన్ననాటి స్నేహితులు కాగా.. దాసరి నవీన్తో వినితకు పరిచయం ఉన్నది. ఇదిలా ఉండగా బుధవారం ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై యాదగిరిగుట్టకు వెళ్లి గురువారం తెల్లవారు జామున తిరుగు ప్రయాణం అయ్యారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి మీదుగా అవుషాపూర్ రాగానే బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై పెట్రోల్ బంకులో నుంచి జాతీయ రహదారి ఎక్కుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు ఎక్కడ కలిశారు.? ఎక్కడికి వెళ్లి వస్తున్నారు..? ఎందుకు వెళ్లారు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి
హయత్నగర్, జూన్ 23 : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ డివిజన్ పరిధిలోని వస్పరినగర్ కాలనీలో తిరుపతి సత్యనారాయణ, కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే గురువారం సత్యనారాయణ హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. భారత్ బెంజ్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.