పొద్దున నిద్ర లేవగానే తయారై టిఫిన్ చేసి, ఆఫీస్కు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి, తినేసి నిద్రపోవటం.. ఇదే చాలా మంది నిత్య జీవనం అవుతున్నది. వాకింగ్ ఉండదు, రన్నింగ్ అసలే ఉండదు. వ్యాయామం అన్న మాటకు ఆమడ దూరం. ఒక్క చుక్క కూడా చెమట రాలదు. పైగా ఇంట్లో, ఆఫీస్లో ఏసీ.. కూర్చున్నకాడికే అన్నీ. దీనివల్లే రోగాలు వచ్చిపడేది. శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందుల ఖరీదు రూ.లక్షల కోట్లు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: శారీరక శ్రమ లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. బద్ధకం ఉంటే ఊబకాయం, డయాబెటిస్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటంతో పాటు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని తాజా నివేదికలో పేర్కొన్నది. శరీరానికి శ్రమ చెప్పకపోవడం కారణంగా 2020 నుంచి 2030 మధ్య ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పడే ప్రమాదం ఉన్నదని అంచనా వేసింది. తద్వారా ఆయా వ్యాధులకు రోగులు చికిత్స చేయించుకొనేందుకు ఏడాదికి దాదాపుగా రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని, మొత్తంగా 2030 నాటికి రూ.25 లక్షల కోట్లు వ్యయం అవుతుందని తెలిపింది. తమ దేశాల ప్రజలు శారీరకంగా శ్రమ దిశగా సాగేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో సూచించింది.
నడక, సైక్లింగ్, క్రీడలు
నడవడం, సైకిల్ తొక్కడం, ఆటలు ఆడటం, ఇతర శారీరక శ్రమ ద్వారా ప్రజలు మరింత చురుగ్గా ఉండేలా అన్ని దేశాలు విధానాల అమలును వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా శారీరక శ్రమ కార్యక్రమాల ద్వారా వ్యక్తులకు శారీరకంగా, మానసికంగానే కాకుండా.. సమాజానికి, పర్యావరణానికి, ఆర్థిక పరిస్థితులకు కూడా లబ్ధి చేకూరుతుందని అన్నారు. శారీరక శ్రమ వలన కలిగే ప్రయోజనాల ప్రచారంలో కూడా దేశాలు వెనుకబడివున్నాయని డబ్ల్యూహెచ్వో నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 50 శాతం దేశాలు మాత్రమే గత రెండేండ్లలో ప్రచార కార్యక్రమాలు, సామూహిక ఫిజికల్ యాక్టివిటీ ఈవెంట్లను నిర్వహించాయని తెలిపింది. కొవిడ్ మహమ్మారి ఇలాంటి కార్యక్రమాలను నిలిపేయడమే కాకుండా ఇత ర విధానాల అమలుపై కూడా ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
5 గంటల కంటే తక్కువ నిద్ర పోయినా!
రోజూ 5 గంటల కంటే తక్కువ నిద్ర పోయినా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం హెచ్చరించింది. 50 ఏండ్ల వయసులో ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువగా నిద్రపోయే వారిలో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం 20 శాతం అధికమని యూకేకు చెందిన యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు పేర్కొన్నారు. ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే.. తదుపరి 25 ఏండ్ల వ్యవధిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయ్యే అవకాశం 40 శాతం ఎక్కువని వెల్లడించారు. ఈ మేరకు అధ్యయన వివరాలు పీఎల్వోఎస్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. తక్కువ నిద్ర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని, మరణ ప్రమాదం ఎక్కువవుతుందని పేర్కొన్నారు.
దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి
‘ది గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ-2022’ నివేదికను డబ్ల్యూహెచ్వో బుధవారం విడుదల చేసింది. అన్ని వయస్కుల వారిలో ఫిజికల్ యాక్టివిటీని పెంచేందుకు సిఫార్సులను ఎంత మేర అమలు చేస్తున్నాయో పరిశీలించింది. 194 దేశాలకు చెందిన డాటాను పరిశీలించగా.. పురోగతి నెమ్మదిగా ఉన్నదని తేలిందని నివేదికలో తెలిపింది. ఫిజికల్ యాక్టివిటీని పెంచి, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించింది. 194కి గానూ 50 శాతం కంటే తక్కువ దేశాల్లో నేషనల్ ఫిజికల్ యాక్టివిటీ పాలసీ ఉన్నదని, అందులోనూ 40 శాతం దేశాల్లోనే అమలవుతున్నదని తెలిపింది.