‘తెలంగాణది పోరాట తత్వం. ఇక్కడ పోరాటమే తప్ప విజయాల్లేవు. ఇక్కడ అసమాన త్యాగాలుంటాయి.’ దాదాపు ఇదే అర్థంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని ప్రఖ్యాత రచయిత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమ నాయకులు దాశరథి రంగాచార్యులు ‘జీవనయానం’లో చెప్పిన మాట.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోదు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను ఒప్పుకొంటే దేశవ్యాప్తంగా చాలా డిమాండ్లు వస్తాయి. అందువల్ల కేంద్రం ఈ డిమాండ్ను ఒప్పుకొనే అవకాశం లేదు’ అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అగ్రశ్రేణి నాయకులు రావి నారాయణరెడ్డి చెప్పిన మాట.
‘లక్ష్యం వైపు గురిపెట్టి అస్ర్తాన్ని సంధించినవాడే విజయాన్ని సాధిస్తాడు’ స్వామి వివేకానందుడు చెప్పిన మాటిది.
పై మూడు మాటలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు, ఆకాంక్ష, సాధ్యాసాధ్యాల చర్చలకు అద్దంలా ఉన్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకం చేయాలని చూసిన పెద్దల దృష్టికోణం నుంచి చూసినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు. నాడు ఉన్న పరిస్థితులను బట్టి వారు ఆ అంచనాకు వచ్చి ఉండవచ్చు. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేవరకు చాలామంది ఇలాంటి భావనతోనే ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు చరిత్ర.. ఓ నాయకున్ని తయారుచేసుకుంటుంది. అతడు లక్ష్యం వైపు గురిపెట్టి అస్ర్తాన్ని సంధిస్తాడు. విజయం సాధిస్తాడు. అతడే కేసీఆర్. ఆయన స్థాపించిన పార్టీ టీఆర్ఎస్. 2001లో ప్రారంభమైన పార్టీ 20 ఏండ్లు పూర్తిచేసుకున్నది. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం’ ఈ కలను నిజం చేసేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేశారు. సమస్యల ప్రవాహంలో కొట్టుకుపోయిన వారు కొందరు. కాలపరీక్షకు నిలబడలేక పడిపోయినవారు ఇంకొందరు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో వైఫల్యం చెంది ఆ ఆలోచనే విరమించుకున్నవారు మరికొందరు. జాబితా చాలా పెద్దగానే ఉంది. 1948 నుంచి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని కొందరంటే.. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం’ కావాలని కొందరన్నారు. తెలంగాణ రాష్ట్రమే కావాలనే వారి మాటను పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం పురుడుపోసుకోవడానికి నాడున్న రాజకీయ పరిస్థితులతో ఒక బలమైన రాజకీయ సిద్ధాంత భూమిక కూడా ఏర్పడలేదు. 1952-53లో నాడు చదువుకున్న యువకులు, పట్టణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను బలంగా లేవనెత్తారు.‘ఇడ్లీ, సాంబర్ గో బ్యాక్’ అన్నారు. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం వేలాదిమంది గొంతెత్తి నినదించారు.
ఇక 1969లో పతాకస్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. కారణాలనేకం ఉండొచ్చు. అదీ ఆగిపోయింది. ఆ తర్వాత 1996లోనూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్లీ వచ్చింది. ఇట్లా దఫాదఫాలుగా వచ్చింది, ఆగింది. కానీ కనుమరుగు కాలేదు.
2001 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వివిధ రూపాల్లో వ్యక్తమైంది. అప్పటివరకు ఉన్న వ్యక్తులు, శక్తులు బాగానే ప్రభావాన్ని చూపించారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రత్యేక రాష్ర్టోద్యమం యావత్ చరిత్రను తనవైపు తిప్పుకొన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. దీనికి ప్రధాన కారణం ఉద్యమకారులను నడిపించే నాయకుడు రావడం ఒక అంశమైతే. రెండోది బలమైన భావజాల వ్యాప్తి వాహకంగా, ఓట్ల పునాదిగా పుట్టిన రాజకీయపార్టీ పురుడుపోసుకోవడం. ఇవి తెలంగాణ చరిత్రనే మలుపుతిప్పిన మైలురాళ్లు.
ప్రత్యేక తెంలగాణకు ఢిల్లీ ఒప్పుకోదు. టీఆర్ఎస్ పార్టీని అక్కడ ఎవరు పట్టించుకుంటరు. అయినా ఒక్కరితో ఇంత పెద్ద డిమాండ్ సాధ్యమేనా. ఈ తరహా ప్రశ్నలు చాలానే వచ్చాయి. కానీ కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా నడిపిన మంత్రాంగం, ఆయన వేసిన ఎత్తులు త్వరగా ఎవ్వరికీ అర్థం కాలేదు. అర్థమయ్యేలా ఆయన అమలుచేయలేదు. అప్పటికి తెలంగాణ కోసం ఓ పార్టీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడం అంతకుముందు లేదు. జాతీయపార్టీలు తమ ప్రయత్నాలు చేసినా అవి రాష్ట్ర డిమాండ్ను సాధించేలా లేవు. నాటి కేంద్రంలో భాగస్వామిగా చేరి, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెట్టించడమనేది ఒకే ఒక్క ఎంపీ చేసిన తొలి విజయ యత్నం.
దొరికిన చిన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ చాలా వేగంగా అడుగులు ముందుకువేశారు. ఎన్నికలు, ఉప ఎన్నికల ద్వారా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఓట్ల ఉద్యమంగా మలిచారు. బహుశా మన దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడూ ఈ స్థాయిలో ఇంత లాజికల్గా సామాన్య ప్రజలను ఓ డిమాండ్ వైపు మలిచిన తీరు చాలా అరుదైనది. ఇది కూడా ఓ రాజకీయంగానే సాధ్యమైంది. ఇలా వరుస ఎన్నికల జయాపజయాలు మధ్యతరగతి ప్రజలను ఆలోచింపజేశాయి. ‘నీళ్లు, నిధులు, నియామాకాలు’ ఈ ట్యాగ్లైన్ చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లింది. కేసీఆర్ మౌనంగా ఉన్నా వార్తనే.. ఆయన మాట్లాడినా వార్తనే. అదీ పత్రికల్లో పతాకస్థాయిలో ఉండేలా. ఇవన్నీ కేసీఆర్ చాలా వ్యూహాత్మంగా అమలుచేసుకుంటూ వచ్చినవే. ఇలాంటివన్నీ ఉద్యమాన్ని చల్లార్చకుండా సజీవంగా ఉంచాయి. నాడున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ తెలంగాణ సాధిస్తారా.? అనే సందేహాలు కూడా వచ్చాయి.
ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్ ఉండదు. పార్టీ పనయిపోయింది. ఆ పార్టీలో ఎవ్వరూ ఉండరు. ఇలాంటి ఊహాగానాలూ వచ్చాయి. అయినా అవన్నీ తట్టుకొని పార్టీ ముందుకే సాగింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకుల చైతన్యస్థాయిలో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మాస్ మూవ్మెంట్గా తీసుకువెళ్లడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. సాధారణ జనం భాషలో ఆయన మాట్లాడే మాటలు, విషయాన్ని ఆయన వివరించే తీరు ఇవన్నీ కలిసి.. ఈయనే బలమైన నాయకుడనే ముద్ర ప్రజల్లో పడింది. దానికితోడు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్రం కోరుకునే వారందరూ ఉద్యమాన్ని గెలిపించుకునే ఒక అనివార్యతనూ కేసీఆర్ సృష్టించగలిగారు. ఇదంతా కూడా రాజకీయ పార్టీ అధినేతగా, లక్ష్యంపై స్పష్టమైన గురి ఉన్న నాయకునిగా కేసీఆర్ వేసిన ఎత్తుగడలు, అమలుచేసిన వ్యూహాలు దక్కన్ పీఠభూమిలో సరికొత్త చరిత్రను రచించాయి.
అలుపెరుగని ఉద్యమ ప్రస్థానం, విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 25న ప్లీనరీ జరుపుకొంటున్నది. మన కళ్లముందు జరిగిన చరిత్ర. మనం జీవించిన చరిత్ర. మనను నడిపించిన కాలం. ఇవన్నీ చరిత్రలో భాగం. కొన్నిసార్లు అరుదుగా అయినా కావొచ్చు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యాలై మన కళ్లముందు నిలబడతాయి. అలాంటిదే టీఆర్ఎస్ ప్రస్థానం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
గోర్ల బుచ్చన్న
87909 99116