ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి ట్రేడింగ్లో భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ కీలకమైన 51 వేల పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ 15 వేల మార్క్ను కోల్పోయింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు కోల్పోయి 50,395 వద్ద నిలిచింది. నిఫ్టీ 101 పాయింట్లు క్షీణించి 14,929 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా దిగజారుతూ చివరకు భారీ నష్టాలను మిగిల్చాయి.
బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లోని షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో చాలా సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు కూడా సూచీలపై ప్రభావం చూపించాయి.