ముంబై, అక్టోబర్ 13: వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ తొలిసారిగా 18వేల ఎగువన ముగిసింది. ఆటో, పవర్, మౌలిక రంగాల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడంతో 169.80 పాయింట్లు లేదా 0.94 శాతం బలపడి మునుపెన్నడూ లేనివిధంగా 18,161.75 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 18,197.80 స్థాయిని తాకి నయా ఇంట్రా-డే రికార్డునూ నిఫ్టీ నెలకొల్పింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ సైతం 452.74 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి ఆల్టైమ్ హై 60,737.05 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలోనూ 60,836.63 స్థాయికి ఎగబాకి నూతన రికార్డును సృష్టించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఐటీసీ తదితర షేర్ల విలువ 5 శాతానికిపైగా పెరిగాయి.
రూ.271 లక్షల కోట్లకు..
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజులు లాభాల్లోనే ముగియడంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువ రూ.2,70, 73,296. 03 కోట్లకు చేరింది. బుధవారం ఒక్కరోజే రూ.2,42,908.24 కోట్లు ఎగిసింది. మొత్తం ఈ ఐదు రోజుల్లో రూ.8,52, 748.98 కోట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 1,547.32 పాయింట్లు పెరిగింది.
టాటా మోటర్స్ కాసుల వర్షం
మదుపరులకు టాటా మోటర్స్ షేర్లు కాసుల వర్షం కురిపించాయి. బుధవారం ఒక్కరోజే షేర్ విలువ 20 శాతానికిపైగా పెరిగింది మరి. టీపీజీ రైజ్ ైక్లెమెట్ నుంచి రూ.7,500 కోట్ల నిధుల సమీకరణ ఒప్పందం ఇన్వెస్టర్లను విపరీతంగా మెప్పించిందంటూ ట్రేడింగ్ సరళిని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిధులను ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికిల్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టనున్నారు. బీఎస్ఈలో 20.43 శాతం వృద్ధి చెంది రూ.506.75 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ 23.56 శాతం వృద్ధితో రూ.519.95 స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ.28,538.6 కోట్లు ఎగబాకి రూ.1,68,256.60 కోట్లను తాకింది.
రిలయన్స్ దూకుడు
రిలయన్స్ ఇండస్ట్రీస్.. సౌర విద్యుదుత్పత్తి రంగంలో మరో రెండు డీల్స్ను కుదుర్చుకున్నది. జర్మనీకి చెందిన నెక్స్వేఫ్, డెన్మార్క్ ఆధారిత స్టీస్డల్ టెక్నాలజీలను రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ చేజిక్కించుకోనున్నది. ఈ మేరకు తాజాగా సంస్థ స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. కాగా, నెక్స్వేఫ్ను రూ.218 కోట్లకు హస్తగతం చేసుకుంటున్న రిలయన్స్.. నాలుగు రోజుల క్రితం రూ.5,770 కోట్లతో ఆర్ఈసీ, స్టెర్లింగ్ వాటాలను పొందిన విషయం తెలిసిందే.