ముంబై, సెప్టెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపదను ఆవిరి చేస్తున్నాయి. గత మూడు రోజుల పతనాన్ని కొనసాగిస్తూ సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 953.7 పాయింట్లు లేదా 1.64 శాతం దిగజారి 57,145.22 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,060.68 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. మొత్తం ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,574.52 పాయింట్లు లేదా 4.31 శాతం పడిపోయింది.
ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.13,30,753.42 కోట్లు హరించుకుపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం సోమవారం 311.05 పాయింట్లు లేదా 1.8 శాతం క్షీణించి 17,016.3 వద్ద స్థిరపడింది. మారుతి, టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలూ 3.33 శాతం, 2.84 శాతం చొప్పున నష్టపోయాయి.
రంగాలవారీగా ఐటీ మినహా అన్ని షేర్లు నిరాశపర్చాయి. రియల్టీ, ఆటో, యుటిలిటిస్, పవర్, కమోడిటీస్, ఎనర్జీ, చమురు, గ్యాస్, టెలీకమ్యూనికేషన్స్ షేర్లు 4.29 శాతం నుంచి 2.97 శాతం మేర పడిపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, హాంకాంగ్ సూచీలూ నష్టాలకే పరిమితమయ్యాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు నేలచూపులే చూస్తున్నాయి. కాగా, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి పతనం, రిజర్వ్ బ్యాంక్ల వడ్డీరేట్ల పెంపు, దేశ-విదేశీ ఆర్థిక వ్యవస్థల వృద్ధిరేటుపై నెలకొన్న భయాందోళనలు.. స్టాక్ మార్కెట్ల లాభాలను అడ్డుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.