ముంబై, ఏప్రిల్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం హెచ్డీఎఫ్సీ సంస్థల విలీన ఒప్పందం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఉదయం ఆరంభం నుంచే భారీ లాభాలను సంతరించుకున్న సూచీలు.. చివరిదాకా దాదాపు అదే ఊపును కొనసాగించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 60వేల మార్కుకు ఎగువన ముగిసింది. 1,335.05 పాయింట్లు లేదా 2.25 శాతం ఎగిసి 60,611.74 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 18వేల మార్కును అధిగమించింది. 382.95 పాయింట్లు లేదా 2.17 శాతం ఎగబాకి 18,053.40 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ప్రధాన ఐరోపా సూచీలూ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
10 శాతం పైకి..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవుతున్నదన్న ప్రకటనతో మదుపరులు ఆ రెండు కంపెనీల షేర్లను ఎగబడి కొనేశారు. దీంతో సెన్సెక్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ 9.97 శాతం, హెచ్డీఎఫ్సీ షేర్ విలువ 9.30 శాతం లాభపడింది. ఈ క్రమంలో కొటక్ బ్యాంక్, హెచ్యూఎల్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా స్టీల్ షేర్లకూ మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు భారీ లాభాలు అందాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్తోపాటు పవర్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ షేర్లూ 4.25 శాతం నుంచి 1.79 శాతం వరకు మెరిశాయి.
21 పైసలు పెరిగిన రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 21 పైసలు పెరిగి 75.53కు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూపాయి చూసిన తొలి భారీ పెరుగుదల ఇదే. దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలు కలిసొచ్చాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూపాయి మారకం విలువ 3.61 శాతం లేదా 264 పైసలు పడిపోయిన విషయం తెలిసిందే.
రూ.4.5 లక్షల కోట్లకుపైనే..
మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఆసక్తి కనబర్చడంతో స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఒక్కసారిగా పుంజుకున్నది. బీఎస్ఈ మదుపరుల సంపదే ఈ ఒక్కరోజు రూ.4.5 లక్షల కోట్లకుపైగా ఎగిసింది. రూ.4,57,826. 69 కోట్లు పెరిగి రూ. 2,72,46,213. 62 కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్, టైటాన్ మినహా మిగతా షేర్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ వివరాల ప్రకారం 179 షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 1.68 శాతం పెరిగాయి. ఇక నిఫ్టీ లాభాల్లో 70 శాతానికిపైగా హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లతోనే వచ్చినవని నిపుణులు పేర్కొంటున్నారు.