ముంబై, సెప్టెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ మళ్లీ 59 వేల మార్క్ను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒత్తిడికి గురైనప్పటికీ మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 442.65 పాయింట్లు లాభపడి 59,245.98 వద్ద ముగిసింది.
అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 126.35 పాయింట్లు ఎగబాకి 17,665.80 వద్ద స్థిరపడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్లు ఒక్క శాతానికి పైగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. వీటితోపాటు టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, ఎస్బీఐ, మారుతి, టీసీఎస్ల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, నెస్లెలు నష్టాల్లో ముగిశాయి.